ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 7:55 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

గ్లోబల్ సమ్మిట్- రక్ష ఎక్స్‌పోలో భాగ‌స్వాములు కండి దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ ప్రాజెక్టుకు ఉచితంగా భూ కేటాయింపు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌-2026కు ఆహ్వానం ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

ఢిల్లీ:అర్జున్ సమాచారం:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026కు హాజ‌రుకావాల‌ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో డిసెంబర్ 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు స‌ద‌స్సు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. స‌దస్సులో భాగంగా నిర్వహించే రక్షణ ఎక్స్‌పో-2026ను ప్రారంభించాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలో ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధ‌వారం భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై కేంద్ర మంత్రితో ముఖ్య‌మంత్రి చ‌ర్చించారు. రక్షణ ఎక్స్‌పో లో ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, స్పేస్‌ రంగాలకు సంబంధించిన ప్రత్యేక సదస్సుతో పాటు ప్రతిష్టాత్మక ఎయిర్‌షో, పారిశ్రామిక ప్రదర్శన, భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. దేశవ్యాప్తంగా రక్షణ రంగ పరిశ్రమలు, స్టార్టప్‌లు, యువ శాస్త్రవేత్తలు పాల్గొనే రక్షణ ఎక్స్‌పోకు ర‌క్ష‌ణ శాఖ మంత్రి హాజరై మార్గనిర్దేశం చేస్తే, వారికి ఎంతో స్ఫూర్తిదాయ‌కంగా ఉంటుంద‌ని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించే రక్షణ ఎక్స్‌పో-2026కు స్వాగతం పలికేందుకు త‌మ ప్రభుత్వం ఎదురుచూస్తోందని రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు.

రక్షణ ఎక్స్‌పో-2026ను అంతర్జాతీయ ప్రమాణాలతో విజయవంతంగా నిర్వహించేందుకు రక్షణ శాఖ సహ‌క‌రించాల‌ని కేంద్ర మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. ఎయిర్‌షో నిర్వహణకు అవసరమైన గగనతల అనుమతులు ఇవ్వడంతో పాటు భారత వైమానిక దళానికి చెందిన విమానాలు, సూర్యకిరణ్‌, సారంగ్‌ ఏరోబాటిక్‌ బృందాలు ప్రదర్శనలో పాల్గొనేలా సహకరించాలని కోరారు. స్టాటిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రదర్శనకు కూడా సహక‌రించాల‌న్నారు. భూ, నౌకా, వైమానిక దళాలకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ప్ర‌ద‌ర్శ‌న‌లో ఏర్పాటు చేయాల‌ని, త్రివిధ దళాల ఉన్నతాధికారులు, ప్రతినిధులు భాగ‌స్వాములు కావాల‌ని సీఎం విజ్ఞ‌ప్తి చేశారు.

హెచ్‌ఏఎల్‌, బీఈఎల్‌, బీడీఎల్‌, ఎండీఎల్‌ తదితర రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు, డీఆర్‌డీవో ప్రయోగశాలలు రక్షణ ఎక్స్‌పోలో విస్తృతంగా పాల్గొని స్వదేశీ రక్షణ సాంకేతికతను ప్రదర్శించాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. విదేశీ రక్షణ శాఖ ప్రతినిధులు, ద్వైపాక్షిక రక్షణ ప్రతినిధి బృందాలు, అంతర్జాతీయ రక్షణ సంస్థల ప్రముఖులతో సమావేశాలు నిర్వహించేందుకు కేంద్ర రక్షణ శాఖ సహకరించాలని సీఎం విజ్ఞ‌ప్తి చేశారు.

ఆదిలాబాద్ విమానాశ్ర‌యానికి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే 750 ఎక‌రాలు భూ సేక‌ర‌ణ చేపట్టింద‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. ర‌క్ష‌ణ శాఖ కోరిన‌ట్లు మొత్తం 1500 ఎక‌రాలు కోరినందున‌, మ‌రో 750 ఎక‌రాలు సేక‌రించే ఇచ్చేందుకు ముఖ్య‌మంత్రి అంగీకారం తెలిపారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల (డీఆర్‌డీఎల్‌) ఆధ్వర్యంలో చేప‌ట్ట‌నున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు 416.18 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఇప్ప‌టికే టీజీఐఐసీ అంగీక‌రించింద‌ని రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. ఎకరానికి కాకుండా మొత్తం భూమికి సంవత్సరానికి కేవలం రూ.1 నామమాత్రపు లీజు అద్దెతో 33 సంవత్సరాల కాలానికి భూమిని కేటాయించనున్నట్లు తెలిపారు. అవ‌స‌ర‌మైతే దానిని మ‌రో రెండుసార్లు లీజు పొడిగించుకునే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. స‌మావేశంలో రాష్ట్ర శ‌క్తి శాఖ మంత్రి జి.వివేక్ వెంక‌ట‌స్వామి, ఎంపీలు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్‌, డాక్ట‌ర్ మ‌ల్లు రవి, సురేశ్ షెట్కార్‌, పోరిక బ‌ల‌రాం నాయ‌క్‌, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు (ప్రొటోకాల్‌) హ‌ర్కార వేణుగోపాల్ పాల్గొన్నారు.
===========================